ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..!

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా..!

( తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. 

ఈ పాటలో ఈ మాట చక్కగావాడుకున్నారు.)

.

మిస్సమ్మ సినిమా 1955 లో వచ్చింది.

ఇందులో రెండు చందమామ పాటలున్నాయి.

వీటినే నేను వెన్నెల పాటలు అని అంటాను. 

మిస్సమ్మలో లీలరాజా పాడిన" రావోయి చందమామ మా వింత గాథ వినుమా" 'అనే పాట ఇప్పటికీ ఎంత బహుళ వ్యాప్తంగా అందరికీ ఆనందాన్ని కలిగిస్తుందో చెప్పవలసిన పనిలేదు. దానికన్నా నాకు నచ్చిన వెన్నెల పాట ఇంకొకటి ఉంది. దాన్ని కింద ఇస్తున్నాను. చదవండి వినండి తర్వాత దీన్ని చదివితే మీ ఆనందం మిన్నుముట్టుతుంది.

.

ఏమిటో ఈ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

వినుటయె కాని వెన్నెల మహిమలు

వినుటయె కాని వెన్నెల మహిమలు

అనుభవించి నేనెరుగనయా

అనుభవించి నేనెరుగనయా

నీలో వెలసిన కళలు కాంతులు

నీలో వెలసిన కళలు కాంతులు

లీలగ ఇపుడే కనిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ.

కనుల కలికమిడి నీకిరణములే

కనుల కలికమిడి నీకిరణములే

మనసును వెన్నగ చేసెనయా

మనసును వెన్నగ చేసెనయా

చెలిమికోరుతూ ఏవో పిలుపులు

నాలో నాకే వినిపించెనయా

ఏమిటో నీ మాయ ఓ చల్లని రాజా వెన్నెల రాజా

ఏమిటో నీమాయ....

.

ఈ పాట మాధుర్యం వింటే బాగా తెలుస్తుంది. అంతే కాదు సినిమా చూస్తే ఈ పాటలోని గొప్పతనం తియ్యదనం ఏమిటో తెలుస్తుంది. ఇందులో నాయకుడు ఎన్టీఆర్, నాయిక సావిత్రి ఇద్దరూ 1950ల్లో బి.ఎ పాసయ్యారు. ఆనాటికి బి.ఎ పాసు కావడమంటే నేడు పి.హెచ్.డి చేసిన వారికున్నంత స్థాయితో లెక్కవేసేవారు. అయితే ఉద్యోగానికి వచ్చిన అడ్వర్టైజ్ మెంట్లో స్కూలు పంతులు గార్ల ఉద్యోగాలు పడ్డాయి. అందులో మెలికేమిటంటే ఒక ఆడ బి.ఎ ఒక మగ బి.ఎ కావాలని ఇద్దరూ భార్యాభర్తలు అయి ఉండాలని ప్రకటనలో ఉంది. సావిత్రి ఎన్టీఆర్ ఉద్యోగాలకోసం తిరిగి తిరిగి విసిగి పోయారు. దీన్ని చూచి పెళ్ళికాని వాళ్ళిద్దరూ మాకు పెళ్ళి అయిందని అబద్ధం ఆడి, రాసి ఉద్యోగంలో చేరారు. కథలో గమ్మత్తు ఏమిటంటే అప్పటిదాకా వాళ్ళిద్దరికీ పరిచయం లేదు. పరిచయం అయిన రెండు మూడు రోజులకే ఈ ఉద్యోగానికి అప్లై చేశారు. ఆ అమ్మాయి క్రిస్టియన్ అతను హిందూ, ఇద్దరికీ పెళ్ళి కావడం అప్పటి పరిస్థితిలో సాధ్యం అయ్యే పని కాదు. రెండు నెలలు పని చేసి గొంతు మీద ఉన్న బాకీ తీర్చుకొని పోదామని ఆమె చేరింది.

.

అబద్ధాలతో బతుకుతుంటారు. భార్యాభర్తలు గా నటించడానికి చాలా కష్టపడుతుంటారు. 

తనకు తెలియకుండానే తనలో ఆతని పట్ల ఎంతో గాఢమైన ప్రేమ ఉందని ఆమె తెలుసుకుంటుంది. అతన్ని నిద్రపుచ్చడానికి పాట అందుకుంటుంది. ఇంత కథా సందర్భాన్ని గర్భీకరించుకొని వచ్చిన పాట పైన చెప్పిన వెన్నెల పాట. తన ప్రవృత్తిని తన మనఃస్థితిని ఈ పాటలో కవి వెల్లడిస్తాడు. సినిమా మొత్తానికి కథని మాటలని అందించిన కవి ఒక్కడే కావడం వల్ల కథా సందర్భాన్ని తెలుసుకొని దానికి ఇమిడేలా పాటనురాసాడు పింగళి నాగేంద్రరావు.

ఇప్పడు పాటని చూస్తే విషయం మనకు తెలుస్తుంది. తనలో కలిగిన ప్రేమను ఆ స్థితిని ఏమిటో ఈ మాయ అని అనుకుంటుంది గదిలోనుండి బయటికి వచ్చి బల్లమీద కూర్చుని నింగిలోని చందమామ వైపు చూస్తూ పాడుతుంది సావిత్రి ఈ పాటని. ముఖంమీద వెన్నెల పడే తీరును కెమేరా కళతో చిత్రించిన తీరు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఓ చల్లని రాజా వెన్నెల రాజా ఏమిటో ఈ మాయ అని చందమామతో చెప్పుకుంటుంది. ఈ స్థాయిలో కూడా నాయిక తన ప్రేమని నాయకుడి ఎదురుగా కూర్చుని చెప్పదు. కుస్తీపట్లుపట్టే లా ఉండే కొరియోగ్రఫీతో నాయికా నాయకులు ఒకరిమీద ఒకరు యుద్ధం చేస్తూ ఉండేలా ఉండే నేటి రోమాంటిక్ డ్యుయెట్లని తలచుకొని ఆ పాటల్ని చూస్తే ప్రేమని ఎంత సున్నితంగా నిజమైన శృంగరంగా చిత్రించారో తెలుస్తుంది. వినుటయె కాని వెన్నెల మహిమలు అనుభవించి నేనెరుగనయా. అంటుంది. వెన్నెల మహిమ తనపైన ఎలాఉందో అర్థం అయింది. ఇక్కడ వెన్నెల తనలోని ప్రేమకి ప్రతీక చందమామ శైతల్యం ఇక్కడ ప్రణయానికి చిహ్నం. నాయికా నాయకులు కలిసి ఉన్నప్పుడు చందమామ చల్లని రాజు, అదే విరహంలో చందమామ చల్లని వెన్నెలే నాయికకు వేడి మంటలుగా తోస్తుంది. విప్రలంభ శృంగారంలో, విరహంలో చంద్రుడిని తిట్టడం అప్పటి కావ్యాల నుండి ఇప్పటి దాకా వస్తూనే ఉంది. వెన్నెల మండెడిదీ అని ఒక పాటలో అన్నమయ్య కూడా రాసాడు. వెన్నెల మహిమ ఎలా ఉంటుందో ప్రణయంలో అది ఎంత చల్లాగ ఉంటుందో తనకు ఇప్పటి దాకా తెలియదని చెబుతూ తనకు నీపై ప్రేమ కలిగిందని నాయకుడికి నర్మగర్భంగా చెబుతుంది ఇక్కడి నాయిక సావిత్రి.

.

కనుల కలికమిడి నీకిరణములే మనసును వెన్నగ చేసెనయా అని అంటుంది. కనులకలికమిడి అని చెప్పడం అద్భుతమైన తెలుగు పలుకుబడి. తల నెప్పి కలిగినప్పుడు సొంటితో కలికం చేసి కంట్లో రాస్తారు. మొదట భగ్గున మండుతుంది. తర్వాత అద్భుతమైన చల్లదనాన్ని ఇచ్చి తలనొప్పిని పోగొడుతుంది. ఇక్కడ చందమామ కిరణాలే కంట్లో కలికం పెట్టినట్లుగా చేసి మనసును వెన్నెగ చేసాయట. ఇది కవి చేసిన అద్భుతమైన ఊహ. ఆమె మనస్సు వెన్నలా కరిగి ప్రియుడిపైన ప్రేమను వర్షించే స్థితికి చేరిందని చెబుతుంది ఆమె. ఇక చివరిగా చెలిమి కోరుతూ ఏవో పిలుపులు నాలో నాకే వినిపించెనయా అని అంటుంది. ఏమిటో ఈ మాయ అని చివరిగా పాటని ముగిస్తుంది. తనలో అతనిపైని ప్రేమని పూర్తిగా తెలుసుకున్నానని నాయకుడికి చెప్పే తీరుని వర్ణించిన ఈ పాట ఒక మంచి శృంగార రసగుళిక. వెన్నెలని ప్రేమకి ప్రతీకగా చెప్పిన తీరు చాలా బాగుంది.

పింగళి నాగేంద్ర రావు రాసిన ఈ పాటకి సాలూరు రాజేశ్వరరావు కూర్చిన సంగీతం మరింత మాధుర్యాన్ని తెచ్చింది. అంతే కాదు సినీమా ఈ ఘట్టానికి వచ్చే సరికే ఈ పాటని చూసిన ప్రేక్షకులకి మనస్సంతా ఆనందం ప్రేమ నిండిపోతాయి. ప్రేక్షకులు పాత్రలతో తాదాత్మ్యం చెందుతారు. సింధుభైరవి రాగంలో వచ్చిన ఈ పాట మనస్సుకు హత్తుకునే తీరులో ఉంటుంది. ఈ రాగానికి కూడా ప్రణయాన్ని పలికించే గుణం ఉంటుంది.

ఇలాంటి అద్భుతమైన వెన్నెల పాటలు తెలుగు సినిమాల్లో ఆనాటి వాటిల్లో చాలా ఉన్నాయి. వరుసగా వాటి సాహిత్య ఔన్నత్యాన్ని పరిచయం చేస్తాను.

https://www.youtube.com/watch?v=ZKsj94I-Blg



Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!