ధేనుకాసుర వధ! (పోతనామాత్యుడి...తెలుగు భాగవతం నుండి)

ధేనుకాసుర వధ!

(పోతనామాత్యుడి...తెలుగు భాగవతం నుండి)

.

శ్రీరాముడు అనే పేరు గల గోపబాలుడు బలరామ కృష్ణులను చూసి ఇలా అన్నాడు

.

-క.

దూరంబునఁ దాలతరు

స్ఫారం బగు వనము గలదు; పతితానుపత

ద్భూరిఫలసహిత మది యే

ధీరులుఁ జొర వెఱతు రందు ధేనుకుఁ డుంటన్.

-

భావము:

ఆ ధేనుకుడు మహాబలవంతుడు వాడు భయంకరమైన గాడిద రూపంలో ఉంటాడు. తనతో సమానమైన బలం కలిగిన తన బంధువుల తోపాటు తాను మనుష్యులను పట్టుకుని తింటూ ఉంటాడు. అక్కడ చక్కని సువాసనలు వెదజల్లుతూ ఎన్నో కొత్త కొత్త పండ్లు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. వింటున్నారా.

-క.

ఫలగంధము నాసాపుట

ముల జొచ్చి కలంచి చిత్తములఁ గొనిపోయెన్

ఫలముల నమలింపుఁడు మము; 

బలియురకును మీకు దైత్యభటు లడ్డంబే?

.

భావము:

ఆ పండ్ల సువాసనలు మా ముక్కులలో చొరబడి మమ్మల్ని వ్యాకుల పెడుతూ మనస్సులను అటు లాగివేస్తున్నాయి. ఎలాగైనా ఆ పండ్లను మాకు తినిపించండయ్యా. మీరు మహాబలవంతులు మీకు ఆ సామాన్య రాక్షసులు అడ్డమా ఏమిటి.”

అని పలికిన చెలికాని పలుకు లాదరించి విని నగి వారునుం దారును నుత్తాలంబగు తాలవనంబునకుం జని; యందు.

-క.

తత్తఱమున బలభద్రుఁడు

తత్తాలానోకహములఁ దనభుజబలసం

పత్తిఁ గదల్చుచు గ్రక్కున

మత్తేభము భంగిఁ బండ్లు మహిపై రాల్చెన్.

భావము:

బలరాముడు తొందర తొందరగా ఆ తాటి చెట్లను పట్టుకుని తన భుజబలంతో మదించిన ఏనుగులా కదలించగానే మగ్గిన తాటిపండ్లు దబ దబ నేల మీద రాలాయి.

గార్దభ రూపంలో అక్కడ ఉండే రాక్షసుడు పండ్లు రాల్చిన చప్పుడు విన్నాడు. ఆ ధ్వని చెవిలో పడగానే అదిరిపడి శత్రువులను వెంటనే చంపేయాలనే కోరికతో బయలుదేరాడు.

-మ.

పదవిక్షేపములన్ సవృక్షధరణీభాగంబు గంపింపఁగా

రదముల్ దీటుచుఁ గత్తిరించిన చెవుల్ రాజిల్ల వాలంబు భీ

తిదమై తూలఁగఁ గావరంబున సముద్దీపించి గోపాలకుల్

బెదరన్ రాముని ఱొమ్ముఁ దన్నె వెనుకై బీరంబు తోరంబుగన్.

భావము:

భయంకరంగా విజృంభించి వస్తున్న ఆ రాక్షసుని కాలి తాకిడికి అక్కడ ఉన్న నేలంతా చెట్లతో సహా అదరిపోయింది. అతడు చీలిన చెవులతో, తోక భయంకరంగా ఊగుతుండగా, పళ్ళు పట పట కొరుకుతూ, కొవ్వెక్కి పరిగెత్తుకు వచ్చాడు. ఆ గోపబాలకులు అందరూ బెదరిపోయేటట్లు బలరాముని వక్షస్థలం మీద ఒక తన్ను తన్నాడు.

-క.

మఱియును దనుజుఁడు రామునిఁ

గఱవఁగ గమకించి తెఱపిఁ గానక యతనిం

జుఱచుఱఁ జూచుచు శౌర్యము

పఱిబోవఁగ నింత నంతఁ బదమలఁ దన్నెన్

.

భావము:

తన్నడంతో ఊరుకోకుండా ఆ రాక్షసుడు బలరాముడిని కరవడానికి ప్రయత్నించాడు. కానీ బలరాముడు అంద లేదు. ఇంక చేసేదిలేక ఆ రాక్షసుడు చుర చుర చూస్తూ ఇటు అటు తన్నులు తన్నసాగాడు. అయితే అందులో అతని బలం క్షీణించినట్లు తెలిసిపోతూ ఉంది.

అంత బలభద్రుండు రౌద్రాకారంబున గర్దభాసురుపదంబులు నాలుగు నొక్క కేల నంటంబట్టి బెట్టుదట్టించి త్రిప్పి విగతజీవునిం జేసి.

-మ.

ఒక తాలాగ్రముఁ దాఁక వైవ నది కంపోద్రిక్తమై త్రుళ్ళి వే

ఱొక తాలాగ్రము పైఁబడ న్నదియు నయ్యుగ్రాహతిన్ నిల్వ కొం

డొక తాలాగ్రము పైఁ బడన్ విఱిగి యిట్లొండొంటిపైఁ దాలవృ

క్షకముల్ గూలెఁ బ్రచండ మారుతము దాఁకం గూలు చందంబునన్.

భావము:

అలా చచ్చిన రాకాశి గాడిదను బలరాముడు ఒక తాటిచెట్టుకేసి విసిరి కొట్టాడు. ఆ వేగానికి ఆ చెట్టు విరిగి మరొక తాటిచెట్టు పై పడింది. ఆ వేగానికి ఆ చెట్టు మరొక చెట్టు పై పడింది ఇలాఎన్నో చెట్లు సుడిగాలి దెబ్బకు పడిపోయినట్లు, నేలపై కూలిపడిపోయాయి.

-మ

తంతువులందుఁ జేలము విధంబున నే పరమేశు మూర్తి యం

దింతయుఁ బుట్టునట్టి జగదీశుఁ డనంతుఁడు దైత్యమాత్రు ని

ట్లంతము జేయు టెంతపని? యద్భుత మే విను మంతలోన వాఁ

డంతముఁ బొందు టెల్లఁ గని యాతని బంధులు గార్దభంబులై.

భావము:

దారపు పోగులు మూలపదార్ధమై ఉండగా వాటి ఆధారంతో వస్త్రం చేయ చేయబడుతుంది. అలా దారాల యందు వస్త్రం కలదు. అదే విధంగా పరమేశ్వరుని రూపము ఈ జగత్తుకి మూలపదార్ధము కాగా ఈ సృష్టి అంతా అతని యందే కలదు. అటువంటి స్వామి ఒక సామాన్య రాక్షసుడిని చంపగలగడంలో ఆశ్చర్యం ఏముంది. ఆ రాక్షసుడు చనిపోవడం చూసి, అతడి బంధువులు అంతా గాడిద రూపాలలో కృష్ణుడి పైకి, బలరాముడి పైకి వచ్చిపడ్డారు.

-క.

బలకృష్ణులపైఁ గవిసిన

బలియుర ఖరదైత్యభటులఁ బశ్చిమపాదం

బుల బట్టి తాల శిఖరం

బుల కెగురఁగ వైచి వారు పొరిగొని రధిపా!

భావము:

ఆ బలరామకృష్ణులు తమ పైకి వచ్చిన ఆ రాకాశి గాడిదలను వెనుక కాళ్ళు పట్టుకుని గిర గిరా త్రిప్పి తాడిచెట్ల తలలపైకి విసిరికొట్టి మట్టుపెట్టారు.

అప్పుడు.

-క.

ఆలమున నోలిఁ గూలిన

తాలద్రుమఖండ దైత్యతనుఖండములన్

కీలితమై ధర జలధర

మాలావృతమైన మింటి మాడ్కిన్ వెలిగెన్

భావము:

అలా యుద్ధంలో కూలిపోయిన తాడిచెట్ల ముక్కలూ రాక్షసుల శరీరఖండాలు కలగాపులగంగా భూమిపై పడి ఉండి, ఆ నేల మేఘశకలాలతో ఆవరించబడిన ఆకాశంలా కనిపించింది.

-క.

ధేనుకవనమున నమలిరి

మానవు లావేళఁ దాఁటి మ్రాకుల ఫలముల్; 

ధేనువులు మెసఁగెఁ గసవులు; 

ధేనుకహరభక్తకామధేనువు గలుగన్.

భావము:

ఎన్నాళ్ళ తరువాతో ఆనాడు దేనుకవనంలో గోపకులు ఆ తాడిపండ్లు తనివితీరా తిన్నారు. ఆవులు వనంలోని పచ్చికలు కడుపునిండా మేసాయి.

దేనుకాసురుడిని చంపిన స్వామి భక్తుల పాలిట కామదేనువై ఉండగా వారి కోరికలు తీరడం అదెంతపని.

.

ఆ సమయంబున సురలు విరులవానలు గురియించి దుందుభులు మొరయించి; రంతఁ గమలలోచనుండు గోపజన జేగీయమాన వర్తనుండై, యన్నయుం దానును గోగణంబులం దోలుకొని మందకు జనియె;

ధేనుకాసుర వధ : దశమ స్కంధము - పూర్వ ...

పోతన తెలుగు భాగవతము

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!