జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన పాట!

జగమంతకుటుంబం 

పాట 

పల్లవి : జగమంతకుటుంబం నాది , ఏకాకిజీవితం నాది 

సంసారసాగరం నాదే, సన్యాసం , శూన్యం నావేలే 

చరణం : కవినై ,కవితనై ,భార్యనై ,భర్తనై 

మల్లెలదారుల్లో , మంచు ఎడారుల్లో 

పన్నీటిజయగీతల,కన్నీటి జలపాతాల 

నాతో నేను సహగమిస్తూ ,నాతో నేను రమిస్తూ 

ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం 

కలల్ని,కథల్ని ,మాటల్ని , పాటల్ని ,రంగుల్ని ,రంగవల్లుల్ని 

కావ్యకన్యల్ని ,ఆడపిల్లల్ని //జగమంత//

శ్రీ సిరివెన్నల సీతారామశాస్త్రి గారు అద్వైత దృక్పధం లో వ్రాసిన ఈ పాట ఆధారంగా చేసుకుని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ' చక్రం ' సినిమా నిర్మించారు .కానీ బ్రతికేవాడు ఎలా బ్రతకాలో తెలిపే పాటను చావబోయే వాడు చచ్చే ముందు చెప్పే ఫిలాసఫీ గా మార్చేసారు . కానీ ఆ పాటను వెలుగులోకి తెచ్ఛిన ఘనత ఆయనదే . 

1+1 × 1-1 = 1

రెండు ఒకటి

( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1

పై సమీకరణంలో ‘1’ రెండుగా (1+1 × 1-1) విడిపోయింది . రెండిట్లో ఒకటి (1+1) తిరిగి, క్రింది సమీకరణంలో , రెండుగా అనేకం(X+1 × X-1) గా మారిపోయింది . (X) స్థానంలో ఏ సంఖ్యనైనా ప్రతిక్షేపించుకోవచ్చు .సృష్టిలో ఉన్నది ఒకటే నని అదే రెండుగా అనేకంగా మారిపోయిందని అద్వైత తత్వసారాంశం ఈ తత్వానికి ఆదిశంకరాచార్యలు ఆద్యులు.ఈ అద్వైత తత్వానికి ఫై సమీకరణం 'skeleton' అయితే దానికి రక్త మాంసాలు కల్పించి ప్రాణం పోసింది శాస్త్రి గారి పాట. నవరసాలకు మూలమైన తత్వం ఈ పాటలో ఉంది .

( X+1 × X-1)+1 × ( 1 )-1 = 1

జగమంతకుటుంబం ఏకాకిజీవితం నేను(నాది)

జగమంతకుటుంబం : (X+1 × X-1) లో X బదులుగా (కవి ×కవిత),(భర్త × భార్య),(భగవంతుడు × భక్తుడు) ....ఇలా ఒకరికొకరు వరసైన జంటలను ఎన్నైనా ప్రతిక్షేపించుకోవచ్చు. కానీ ఏవరసకావరసే.తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ఏమాటకామాటే . ఒక వరస పనిచ్తేస్తున్న సమయంలో రెండోది పనిచెయ్యదు . అలా ఏ వరసకు ఆ వరసను , ఏ రసానికి ఆ రసాన్ని విడివిడిగా గుర్తించడమే సామరస్యం .


(2+1 × 3-1) ≠ 1


ఫై సమీకరణంలో 2 వేరు ,3 వేరు . అందువల్ల అవి ఒకటి కాలేదు (≠ 1) అలాగే మనిషి మాటలకు చేతలకు పొంతన లేకపోతే అతడు ‘వ్యక్తి’ కాలేడు .‘వ్యక్తి’త్వ లోపం వంచనకు,ఆత్మవంచనకు,సంఘర్షణకు దారితీస్తుంది . ఐక్యమత్యమే బలం అన్నట్టు మనస్సు,వాక్కు,కర్మ మూడింటికి పొంతన కుదిరి ఐక్యం (ఒకటి)గా ఉంటేనే నైతిక బలం సిద్దిస్తుంది. మనోవాక్కయకర్మలలో ఏకత్వమే చిత్తశుద్ది ,నిజాయితీ.

2 +1 × 2 –1 = 1 

3 +1 × 3 –1 = 1

ఫై సమీకరణాలు రెండింటిలోనూ ఏకత్వం ,ఒకటి( 1) ఉంది .కానీ రెండు సమీకరణాలు ఒకలా లేవు. భిన్నంగా ఉన్నాయి . అలాగే ఏ ఇద్దరి జీవితాలు ఒకలా ఉండవు . ఉదాహరణకు శ్రీరాముడు,శ్రీకృష్ణుడు.వీరిద్దరిలోను, ఫై సమీకరణాల్లో లాగే ఏకత్వం-మనోవాక్కయకర్మలలో ఏకత్వం -ఉంది . కానీ ఇద్దరి జీవితమార్గాలు ఒకలాలేవు . విలక్షణంగా ఉన్నాయి. కారణం వారు ఏకత్వానికి,చిత్తశుద్దికి ప్రాధాన్యత యిచ్చి,అలావుండడానికి నిరంతర సాధన చెయ్యడం వల్ల ఆసాధన ఫలితం ఒక విలక్షణ జీవితవిధానంగా దానంతట అదే రూపుదిద్దుకుంది .ఈ విలక్షణత అంతవరకు కొనసాగుతూ వస్తున్న సాంప్రదాయాన్ని సమర్ధించవచ్చు ,లేదా వ్యతిరేకించవచ్చు . అలాకాకుండా ముందే ఏదో ఒక జీవితవిధానాన్ని ఆదర్శంగా పెట్టుకుని తదనుగుణంగా జీవించడం మొదలుపెడితే అది స్వభావానికి,పరిస్థితులకు విరుద్ధమై , మనోవాక్కయకర్మలలో ఏకత్వాన్ని (integrity)పోగొట్టి అస్థిత్వాన్నే భంగపరుస్తుంది.అస్తిత్వంతో ఉండడమంటే ఏకత్వంతో ఉండడమే .అప్పుడే వ్యక్తిత్వము,విలువలు ,స్వేఛ్చ సిద్ధిస్తాయి . “Is it true?” అని కాక “Is it true for me?” అనేది ఇక్కడ ప్రాధాన్యత వహిస్తుంది . 

ఏకాకిజీవితం : ‘జగమంతకుటుంబం నాది’ అనుకునేవాడికి ఏకాకిజీవితం తప్పదు . ఎందుకంటే అతడు ఏ వర్గంలోను,వ్యవస్థలోను,వ్యక్తులతోను చేరడు . కాబట్టి అతడు ఏకాకి, సన్యాసి. ఎందులోనూ చేరడు కాబట్టే అందర్నీ కలుపుకుపోగలడు . అందువల్ల అతనిది జగమంతకుటుంబం ,సంసారసాగరం . 

నేను (సృష్టికర్త ): సంక్షిప్త రూపం లో ఉన్న 1 విస్తృత రూపం దాల్చి (X+1 × X-1) అయినట్లు , సూక్ష్మరూపంలో వుండే విత్తనం స్థూలరూపం పొంది వృక్షం అవుతున్నట్టు ,ఏకాకిగా వున్న 'నేను' ఇంతితై వటుడింతయై అన్నట్టు విశ్వమంత అయ్యాను . ఏకాకియైన శ్రీకృష్ణుడు ,తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు .

1 లో ( X+1 × X-1)వున్నట్టు ,విత్తనంలో వృక్షం దాగి వున్నట్టు , ఏకాకి లో విశ్వం ఇమిడి వుంది . ఏకాకి ఐన శ్రీకృష్ణుడు తన తల్లి యశోదకు తనలోనే (నోట్లోనే ) విశ్వాన్ని చూపించాడు . 

విశ్వం నాలో నుండే సృష్టి అవుతోంది(evaluation)కనుక జగమంతకుటుంబం నాది . విశ్వం నాలో లీనం (లయం ) అయినపుడు నేను తప్ప ఎవరూ వుండరు కనుక ఏకాకిజీవితం నాది . ఏకత్వంలో భిన్నత్వం జగమంతకుటుంబం. భిన్నత్వంలో ఏకత్వం ఏకాకిజీవితం. 

ఏకాకిగా వున్నసృష్టికర్త కవిగా ,కవితగా ,భార్యగా ,భర్తగా ............సృష్టిగా మారి జగమంత అయ్యాడు . మట్టి, కుండగా మారినట్టు సృష్టికర్తే సృష్టిగా మారాడు . మాధవుడే మానవుడయ్యాడు . నరనారాయణులు ఒక్కరే . నరుడే నారాయణుడు . 

నరుడు ప్రేమికుడిగా,భావుకుడిగా ,భక్తుడిగా ఉన్నపుడు పాడుకోవడానికి ప్రేమగీతాల్ని, భావగీతాల్ని,భక్తిగీతాల్ని ఇంతవరకు కవులందరూ వ్రాసారు . కానీ నరుడు నారాయణుడిగా వున్నపుడు పాడుకునే భగవద్ గీత శాస్త్రి గారి 'జగమంతకుటుంబం'

ఉన్నది ఒకటే నని ,రెండుగా కనిపిస్తున్నవన్నీ ఒకే దానికున్న రెండు పార్శ్వాలని అద్వైతతత్వ సారాంశం.మనిషి ఏ పార్శ్వంలో ఉన్నా,జ్ఞాననేత్రంతో రెండో పార్శ్వం యొక్క ఉనికిని,దాని విలువను గుర్తించగలడు . 

లౌకిక జీవితాన్ని ,ఆధ్యాత్మికతను వేరు వేరుగా చూసేవారికి ఆ రెండిట్లో ఏ ఒక్కటీ, ఎప్పటికీ పూర్తిగా అవగాహనకు రాదు . అద్వైతం లౌకికజీవితానికి అధ్యాత్మికతను జోడిస్తుంది . ఇహపరాలను రెంటినీ ఒక్కటి చేస్తుంది .


Comments

  1. Wonderful explanation. The calculations made are perfectly correct. True

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!