శ్రీ రాముని వంశావళి !

శ్రీ రాముని వంశావళి !

.

శ్రీ రాముడు సూర్య వంశానికి చెందిన మహారాజని మనందరికీ తెలుసు.శ్రీ రాముని వంశానికి చెందిన అతని పూర్వీకుల గురించి కాని, అతడి తర్వాత అయోధ్యనేలిన ఆ వంశీకుల గురించి కాని ఏమైనా తెలుసా?

అయోధ్యనేలిన సూర్యవంశపు రాజులలో శ్రీ రాముడు 64వ వాడని అంతకు ముందు ఆ రాజవంశీకులు 63రు అయోధ్యనేలారని ఇప్పటికి దాదాపు 80 ఏళ్లక్రితం ప్రచురించిన తన “రామాయణ్ కా ఇతిహాస్” అనే గ్రంథంలో శ్రీ రాజ్ బహదూర్ సీతారామ్ గారు తెలియజేసారు.వీరిలో చాలామంది గురించి వాల్మీకే తన రామాయణంలో వశిష్టమహర్షి ద్వారా జనక మహారాజుకు చెప్పించాడు.

.

అమెరికా లోని లూసియానా యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ కాక్ తన “అస్ట్రోనామికల్ కోడ్ ఆఫ్ ది రుగ్వేదా” అనే గ్రంథంలో రామునికి ముందర అయోధ్యనేలిన ఆ వంశపు 63రు రాజుల పేర్లూ, శ్రీ రాముని తర్వాత అతని కొడుకు కుశునితో ప్రారంభించి మరొక 29 మంది రాజులనుగురించి ప్రస్తావించాడు.

ఆ పట్టిక ఈ దిగువన చూడండి.

శ్రీ రాముని వంశావళి. 

1.మనువు 2.ఇక్ష్వాకు .3వికుక్షి 4..కకుత్స5.అనినాశ 6.పృథు

7.విశ్టారశ్వ8.ఆర్ద్ర 9.యవనాశ్వ(1) 10.శ్రావత్స

11.బృహదాశ్వ 12.కువలాశ్వ 13.ధృడాశ్వ 14.ప్రమోద 15.హర్యాశ్వ (16.నికుంబ 17.సంహతాశ్వ 18.అక్రశాశ్వ 19.ప్రసేనజిత్

20.యవనాశ్వ(2) 21.మాంధాత 

22.పురుకుత్స23.త్రసద్స్యు 24సంభూత 25.అనారణ్య 26.త్రసద్స్వ 27.హర్యాశ్వ(2) 28.వసుమత 29.త్రిధన్వ 30.త్రయ్యారుణ

31.త్రిశంకు-32.సత్యవ్రత-33.హరిశ్చంద్ర-34.రోహిత-35.హరిత

-36.విజయ -37.రురుక-38.వ్రక-39.బాహు-40.సగర

41.అసమంజస-42.అంశుమంత-43.దిలీప(1)-44.భగీరథ

45.శ్రుత-46.నభగ-47.అంబరీష-48.సింధుద్వీప-49.అయుతాయు

50.ఋతుపర్ణ-51.సర్వకామ-52.సుదాస-53.మిత్రసహ-54.అస్మాక

55.ములక-56.శతరథ-57.అయిదావిద-58.విశ్వసాహ(1)

59.దిలీప-(2)60.దీర్ఘబాహు-61.రఘు-62.అజ-63.దశరథ

64.శ్రీ రామ

-65.కుశ- 66.అతిథి-67.నిశాధ68.-నల-69.నభస

70.పుండరీక-71.క్షేమధన్వ-72.దేవానిక-73.అభినాగు-74.పరిపత్ర

75.బల-76.యుక్త-77.వజ్రనాభ-78.శంఖ-79.వ్యుశిత్సవ

80.విశ్వసాహ(2)-81.హిరణ్యభ-82.పుష్య-83.ధృవసంధి-84.సుదర్శన85.అగ్నివర్ణ-86.శీఘ్ర-87.మరు-88.ప్రసుశ్రృత-89.సుసంధి-90.అమర్ష

91.మహశ్వత-92.విశ్రుతవంత-93.బృహద్బల-94.బృహత్క్సాయ.

పై పట్టికలో మొదట పేర్కొన్నమనువు వైవస్వత మనువు.ఇతడి కొడుకైన ఇక్ష్వాకుడే అయోధ్యనేలిన మొదటి ఇనవంశపు రాజు.అందుకే అది ఇక్ష్వాకు వంశంగా పేరుగాంచింది.

ఆ తరువాత ఈ వంశంలో20వ వాడైన, రెండవ యవనాశ్వుని కొడుకు మాంధాత చక్రవర్తి పేరు బడసిన మహారాజు.ఆతరువాత 

31వ వాడైన త్రిశంకుడు, -33వ వాడైన హరిశ్చంద్రుని కథలు

మనకుపరిచయమైనవే.

ఈ వంశంలో 40వ వాడైన సగరుడు అతనికొడుకు అసమంజసుడు,మనుమడు అంశుంతుడు,ముని మనుమడు దిలీపుడూ, అతనికొడుకు భగీరథుడూ మనకు గంగావతరణం గాథ ద్వారా సుపరిచితులే.

ఆ తర్వాత 61వ రాజైన రఘువు వలననే వంశానికి రఘువంశమని పేరువచ్చింది.ఈ రఘు మహారాజు మనుమడే శ్రీ రామచంద్రుని కన్నతండ్రియైన దశరథ మహారాజు.శ్రీ రాముని తర్వాత అతనికొడుకు కుశుడు పట్టాభిషిక్తుడౌతాడు.

ఆ తర్వాత రఘువంశంలోని రాజులెవరూ ప్రసిధ్ధులైనట్లు తోచదు.

స్థూలంగా శ్రీ రాముని ముందూ వెనుకా అయోద్య నేలిన సూర్య వంశపురాజుల కథ ఇది.

సరదాగా ఇక్కిడొక ముచ్చట చెప్పి ముగిస్తాను.

శ్రీ రాముని తరువాత అయోధ్య గద్దెనెక్కిన రాజుల్లో 21 వ వాడు అగ్ని వర్ణుడు.ఇతడు భోగ లాలసుడు, విషయలోలుడై రాజ్య పాలన ఏ మాత్రం పట్టించుకునే వాడు కాదట.అయినా అతనికి చాలా సమర్థవంతమైన మంత్రి వర్గం ఉండడంతో రాజ్య పరిపాలన సజావుగానే సాగుతూ ఉండేది.ప్రజలు ఎంత సుఖశాంతులతో వర్థిల్లుతున్నప్ప టికీ వారికి తీరని కోరిక ఒకటి మాత్రం ఉండిపోయిందట. వారికి ఏనాడూ రాజ దర్శనం అయ్యేదికాదట.ఎంతటి ముఖ్యమైన సందర్భమైనా రాజుగారు సభా భవనానికి రాక పోవడంతో జనంలో అనుమానాలు మొలకెత్తడం ప్రారంభించాయట. రాజుగారు మరణించినా ఆవిషయం ప్రజలకు తెలియనివ్వకుండా మంత్రులే తమని మోసగించి పరిపాలిస్తున్నారేమోనని గుసగుసలాడుకోవడం మొదలు పెట్టారట.ఇది రాజ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని గ్రహించిన మంత్రులు, ఒక్కసారి ప్రజలకు దర్శనం దయచేయమని ప్రాధేయపడగా పడగా అందుకు రాజుగారు తాను సభకు రాననీ తాను తన అతఃపుర గవాక్షంనుంచి కాళ్లు బయట పెడతానని ప్రజలు వాటిని దర్శించుకుని మ్రొక్కుకుని వెళ్లిపోవచ్చనీ సెలవిచ్చారట

.చెరకుతుద వెన్ను పుట్టి చెరకులోని తీపినంతా చెరిచినట్లు ఇంత పేరుగాంచిన రఘువంశంలో ఇటువంటి వారు ఉద్భవించిన తర్వాత ఆ వంశం ఎన్నాళ్లు మనగలదు? 

ఆతర్వాత పట్టుమని పది మంది రాజులు అయోధ్యనేలినట్లు లేదు.

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!