కబుర్లు శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు. రచన : టీవీయస్.శాస్త్రి


కబుర్లు
శ్రీ ముని'మాణిక్యం' నరసింహారావుగారు-వారి కొన్నిహాస్యోక్తులు.
రచన : టీవీయస్.శాస్త్రి
నవరసాలలో హాస్యానికి ఒక ప్రత్యేకం మరియు విభిన్న స్థానం వుంది ఎందుకంటే, ఒక పాలు తక్కువ అయితే పండదు, ఒక పాలు ఎక్కువైతే అపహాస్యం పాలవుతుంది. తెలుగు సాహిత్యములో నరసింహారావు గారి కన్నా ముందు వచ్చిన చిలకమర్తివారి గణపతి, మొక్కపాటివారి బారిస్టర్ పార్వతీశం చాలా వరకు హాస్య రస ప్రధాన మైనవే! అందులో ఏ మాత్రము సందేహం లేదు.అయితే అందులో వున్న హాస్యం కొంతవరకు Bafoonary! సునిశితమైన హాస్యం శ్రీ నరసింహారావు గారి నుండే మొదలైందని చెప్పటంలో ఏ దుస్సాహసము లేదు. వారి 'కాంతం కథలు' కలకాలం హాస్య సాహిత్య ప్రియుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. సజీవమైన పాత్రగా కనపడే కాంతం, వారి భార్య పాత్రే అని కొంతమంది అంటారు. కాని అది ఒక fictitious పాత్రే! R.K.Narayan గారి 'మాల్గుడి డేస్' చదివిన కొంతమంది విదేశీయులు మన దేశం వచ్చినప్పుడు కేరళ వెళ్లి, మాల్గుడి ఎక్కడ వుంది అని చాలా విచారించారు.అయితే, మాల్గుడి కేరళలో గాని, మన దేశములో మరి ఎక్కడైనా గాని లేదు. అది కూడా ఒక fictitious గ్రామమే! ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే, గొప్ప రచయితలు సృష్టించే పాత్రలు అలా సజీవమైనవిగా మనకు అనిపిస్తాయి. బందరు వెళ్ళినప్పుడు నాకు గుర్తు కొచ్చేది, మొదట మునిమాణిక్యం వారే! సంసార జీవితం ఎంత రసమయంగా వుంటుందో, ఉంచుకోవాలో తెలియాలంటే వారు వ్రాసిన అన్ని గ్రంధాలు చదవవలసినదే! చాలా బాధాకర మైన విషయము ఏమిటంటే, ఈ తరం యువతీ, యువకులు ఇటువంటివి ఎన్నోmiss అవుతున్నారు. వారు వ్ర్రాసిన 'దాంపత్యోపనిషత్ కథలు' చదువుతే ఏ భార్యాభర్తలు విడాకులు తీసుకోరు.వారి హాస్యోక్తులలో కొన్నిటిని ఈ క్రింద తెలియచేయుచున్నాను. నా ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే, మీరు వెంటనే వారు వ్రాసిన కనీసం కొన్ని పుస్తకాలైనా చదువుతారని!
నరసింహారావు గారు బందరులో ఉపాధ్యాయుడిగా వుండేవారు. ఆ రోజుల్లో బందరు ఒక సాహితీ కేంద్రం. పూర్వం ఉబ్బసానికి గాడిద పాలు నాటు మందుగా వాడే వారు. నరసింహారావు గారి అబ్బాయికి ఉబ్బస వ్యాధి వుండేది. ఒక రోజు, ఆయన స్కూల్ కి వెళ్ళుతూ, భార్యతో 'ఏమోయ్! స్కూల్ నుంచి ప్యూనును పంపుతాను, వాడు గాడిద పాలు తెస్తాడు, ఒక చెంచా పిల్లవాడికి ఇవ్వు' అని అన్నారు.సాయంత్రము, స్కూల్ నుంచి రాగానే, ఏమోయ్ పిల్లవాడికి గాడిద పాలు ఇచ్చావా? అని అడిగారు.అప్పుడామె,'ఆ సంగతే మరచి పోయానండి, ఇప్పుడు మిమ్మల్ని చూస్తే గుర్తుకు వచ్చింది' అని వంటింట్లోకి వెళ్లి పోయింది. ఇందులో ఇమిడిన హాస్యోక్తికి, భార్య సరస సంభాషణకు ఆయన ఎంతగా మురిసిపోయారో!! ఇది మనసులో వుంచుకొని, నరసింహారావు గారు, భార్యకు మంచి సరసమైన బాణం విసరటం కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన, కొంతకాలం కర్నూల్ లో కూడా ఉద్యోగము చేశారు. కర్నూల్ వచ్చిన కొత్తలలో, ఒక రోజు భార్యను పిలిచి, 'ఏమోయ్! కర్నూల్ ఎలా వుంది?' అని అడిగారు. అందుకు ఆమె.'ఏమి కర్నూల్ అండి బాబు! ఎక్కడ చూసినా గాడిదలే! హాస్పిటల్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, మార్కెట్ కు వెళ్ళితే అక్కడ గాడిదలు, ఇలా ఎక్కడ బట్టినా గాడిదలే!' అని ఆవిడ సమాధానం చెప్పింది. వెంటనే శ్రీ వారు ఏమన్నారంటే'అన్నట్లు! గాడిదలంటే గుర్తుకొచ్చింది! ఈ రోజు మీ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేశారు' అని మంచి బాణం విసిరారు. ఆ సంభాషణకు భార్యాభర్తలిదారు మనసార నవ్వుకున్నారు. సంసార జీవితం ఎంత రసమయమో ఆయన రచనల ద్వారా తెలుసుకోవచ్చు. వారు చుట్టలు ఎక్కువగా త్రాగే వారు. ఒక సారి విందు భోజనములో, భోజనాలు అయిన తర్వాత విందు ఇచ్చిన వారు ఒక పళ్ళెములో చుట్టలు, సిగరెట్లు తీసుకొని అతిధులందరి వద్దకి వచ్చారు. శ్రీ వారు చుట్టలు, సిగరెట్లు రెండూ తీసుకొన్నారు. తెచ్చిన ఆయన విస్తుపోయి,' పంతులు గారు మీరు సిగరెట్లు త్రాగటం ఎప్పడినుంచి మొదలెట్టారు?' అని అడిగారు. అందుకు ఆయన వెంటనే, తడుముకోకుండా ఏమన్నారంటే 'నేను ఉభయ భాషా ప్రవీణుడను' అని. చుట్టలు త్రాగటం వదిలి వెయ్యండి, అది మంచి అలవాటు కాదు అని చాలా మంది ఆయనకు చెప్పేవారు. అందుకు ఆయన, మా కుల గురువు గురజాడ వారు 'పొగ త్రాగని వాడు దున్నపోతై పుట్టున్' అని ఎప్పుడో చెప్పారు. నాకు దున్నపోతు కావటము ఇష్టము లేదు, అని చెప్పటమే కాకుండా, మనం పూజించే దేవతలంతా కూడా చుట్టలు త్రాగేవారు. ఇదిగో చూడండి, వచన భాగవతం, అందులో ఏముందో చదివితే మీరే హ ..హ .. హ.. అంటారు. అందులో యేముందంటే. 'ఆది శేషుడు చుట్ట చుట్టుకొని పడుకొండెను' అని. అంటే దాని అర్ధం, రేపటి కోసం ఈ రోజే చుట్ట చుట్టుకొని పడుకొనే ఆదిశేషుడు నాకు ఆరాధ్యుడు'. కురుసభలో శ్రీ కృష్ణుడు' నాకు చుట్టలైన, పరులైనా ఒక్కటే' అనటం మనం వినలేదా !! అంటే శ్రీ కృష్ణుల వారికి చుట్టలైన, సిగరెట్లు అయినా ఒకటే అని అర్ధమని, పండితులైన మీకు నేను వేరే మనవి చేయనవసరం లేదనుకొంటాను' అని చమత్కారంగా చెప్పారు. ఆయనకు నాటకాలు చూడటమంటే భలే పిచ్చి. ఆ రోజుల్లో, బందరులో డి.వి.సుబ్బారావు గారని ప్రఖ్యాత నటులుండేవారు. ఆయన ప్రతాపరుద్రీయం, హరిశ్చంద్ర మున్నగు నాటకాలు ఎక్కువగా ఆడేవారు. పంతులు గారు ఆయన నాటకాలు ఎప్పుడూ మిస్ కాలేదు. నాటకాలు చూసి చూసి, ఆయనకు ఏదో ఒక నాటకంలో ఏదో ఒక పాత్ర వెయ్యాలని కోరిక కలిగింది. జిలపుట్టినప్పుడు గోక్కోవాలి కదా! అదే విషయాన్ని సుబ్బారావు గారికి తెలియ చేశారు. అన్ని వేషాలకు అందరూ బుక్ అయిపోయారు. ఏమి చేద్దామబ్బా! అని ఆలోచిస్తున్నారు. కళా కండూతితో బాధ పడుతున్న పంతులు గారే ఒక సలహా ఇచ్చారు. నాకు రంగస్థలం మీద మొదట కన పడితే చాలు అది ఏ వేషమైనా చాలు అది నౌకరైనా లేక పిచ్చివాడైనా పర్వాలేదు. కథతో సంబంధం లేకపోయినా పర్వాలేదు అని సలహా ఇచ్చారు. సుబ్బారావుగారు కాసేపు దీర్ఘంగా ఆలోచించి సరే ఒక పని చేద్దాం, ఒక ఆడ పాత్ర వుంది, కథతో ఏ మాత్రం సంబంధం లేని పాత్ర అది. మీరు మీసాలు తీయించుకొని మంచి పట్టు చీర కట్టుకొని makeup పూర్తి అయిన తర్వాత stage ప్రక్కనే పడ కుర్చీలో పడుకోండి మీ పాత్ర వచ్చే టైంకు మిమ్మల్ని contractor నిద్ర లేపుతాడు అని చెప్పారు. పంతులు గారు తన కళాకండూతి తీరుతున్నందుకు బాగా సంబరపడి పోయారు. నాటకం వేసే రోజు వచ్చింది. శుభ్రంగా మీసాలు తీయుంచుకొని పట్టుచీర కట్టుకొని makeup చేసుకొని ఆప్రక్కనే ఉన్న పడకుర్చీలో నిద్ర పోతున్నారు. కాంట్రాక్టర్ నిద్ర లేపుతాడుగా! సుష్టుగా భోజనం చేశారేమో బాగా నిద్ర పట్టింది. కథతో సంబంధం లేని పాత్ర కదా! కాంట్రాక్టర్ నిద్ర లేపడం మరచిపోయాడు. మధ్యలో లఘుశంకకు పోయే నిమిత్తం వీరికి మెళుకువ వచ్చింది. మంచి నిద్ర పోవటం చేత చీర నలిగి, విగ్ చిందర వందరగా అయి, పిచ్చిదాని లాగా వున్నారు. వళ్ళుమండే అంత కోపం వచ్చింది. కథతో సంబంధం లేదు కదా అని ఒక మంచి రసవత్తర ఘట్టం జరుగుతుండగా శ్రీవారు స్టేజి పైకి వెళ్లి యేవో రెండు dialogues చెప్పారు. శ్రీ సుబ్బారావు గారు వెంటనే ఎవరక్కడ! ఈ పిచ్చిదాన్ని అవతలికి తీసుకొని పోండి అని చెప్పగానే ఇద్దరు భటులు వచ్చి పంతులుగారిని పెడరెక్కలు పట్టుకొని ఈడ్చుకెళ్ళారు. నాటకం ఏ మాత్రం రసాభాస కాలేదు పంతులుగారి కళాకండూతి కూడా తీరింది! పంతులుగారు తన వేషం కన్నా, శ్రీ సుబ్బారావుగారి సమయస్పూర్తికి యెంతో సంబరపడిపోయారు. ఈ సందర్భంలో మహానటులు సుబ్బారావు గారిని కూడా స్మరించుకోవటం మన అదృష్టం.
ఇలా ఆయనను గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు వినే వాడుంటే!
వారి గ్రంధాలు చదవటం కోసం మీకు ఇది ఒక చిన్న పరిచయం మాత్రమే!!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!