తెలుగుదనానికి 'మల్లెపూదండ'.! శంకరంబాడి సుందరాచారి



తెలుగుదనానికి 'మల్లెపూదండ'.!
శంకరంబాడి సుందరాచారి
తెలుగు రచయితలలో శంకరంబాడి సుందరా చారి (ఆగస్టు 10, 1914-ఏప్రిల్‌ 8, 1977)కి ఒక ప్రత్యేకస్థానం ఉంది.
శంకరంబాడి సుందరాచారి గొప్ప కవి. పద్యకవిత్వం ఆయనకు ప్రీతిపాత్రమైన కవితా ప్రక్రియ. పద్యాలలోనూ తేటగీతి ఆయన ఎంతో ఇష్టపడ్డ చందస్సు. తేటగీతిలో ఎన్నో పద్యాలు వ్రాశాడు. ''నాపేరు కూడా (శంకరంబాడి సుందరాచారి) తేటగీతిలో ఇమిడింది. అందుకనే నాకది బాగాఇష్టం'' అనేవాడు ఆయన. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన ''మా తెలుగు తల్లికి'' కూడా తేటగీతిలో రాసిందే. ఈ పద్యం ఆయన రచనలలో మణిపూస వంటిది. రాష్ట్ర చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని రమ్యంగా వర్ణించిన నాలుగు పద్యాలు అవి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ గీతాన్ని రాష్ట్రగీతంగా గుర్తించి గౌరవించింది. మహాత్మాగాంధీ హత్య జరిగినప్పుడు ఆవేదన చెంది, 'బలిదానం' అనే కావ్యం వ్రాశాడు. 'సుందర రామాయణం' అనే పేరుతో రామాయణం రచించాడు. అలాగే 'సుందర భారతం' కూడా వ్రాశాడు. తిరుపతి వేంకటేశ్వర స్వామి పేరు మకుటంగా 'శ్రీనివాస శతకం' రచించాడు. ఇవే కాక జపమాల, బుద్ధగీతి అనే పేరుతో బుద్ధచరిత్ర కూడా రాశాడు. రవీంద్రుని గీతాంజలిని అనువదించాడు. మూలంలోని భావాన్ని మాత్రమే తీసుకుని, భావం చెడకుండా, తెలుగు నుడికారం పోకుండా చేసి వ్రాసిన ఆ స్వతంత్ర అనువాదం బహు ప్రశంసలు పొందింది. 'ఏకలవ్యుడు' అనే ఖండకావ్యం, 'కెరటాలు' అనే గ్రంథం కూడా రచించాడు. 'సుందర సుధా బిందువులు' అనే పేరుతో భావ గీతాలు వ్రాశాడు. జానపద గీతాలు వ్రాశాడు. స్థల పురాణ రచనలు చేశాడు. సినిమా లకు కూడా పాటలు రాశాడు. మహాత్మాగాంధీ, బిల్హణీయం, దీనబంధు అనే సినిమాలకు పాటలు వ్రాశాడు. దీనబంధు సినిమాలో నటించాడు కూడా. నిజం చెప్పాలంటే సుందరాచారి 'మా తెలుగు తల్లికి...' గీతాన్ని 1942లో దీనబంధు సినిమా కోసం రచించాడు. కానీ ఆ చిత్ర నిర్మాతకు ఆ పాట నచ్చకపోవటం వల్ల ఆ సినిమాలో చేర్చలేదు. టంగుటూరి సూర్యకుమారి గ్రామఫోన్‌ రికార్డు కోసం ఆ పాటను మధురంగా పాడిన తరువాతనే ఆ గీతానికి గుర్తింపు లభించింది.
.
సుందరాచారి, 1914 ఆగస్టు 10న తిరుపతిలో జన్మించాడు. మదనపల్లెలో ఇంటర్మీడియేట్‌ వరకు చదివాడు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. ఒకరోజు తండ్రి మందలింపుకు కోపగించి పంతానికి పోయి, ఇంటినుండి బయటికి వెళ్ళిపోయాడు. భుక్తికొరకు ఎన్నో పనులు చేశాడు. తిరుపతిలో హోటలు సర్వరుగా పనిచేశాడు. రైల్వే స్టేషనులో కూలీగా కూడా పనిచేశాడు. ఆంధ్రపత్రికలో ఫ్రూఫ్‌ రీడరుగా, ఉపాధ్యాయుడిగా, పాఠశాల పర్యవేక్షకుడిగా ఎన్నో వైవిధ్య భరితమైన పనులు చేశాడాయన. అమితమైన ఆత్మవిశ్వాసం ఆయనకు. ఒకసారి ఏదైనా పని వెతుక్కుందామని మద్రాసు వెళ్ళాడు. ఆంధ్రపత్రిక ఆఫీసుకు వెళ్ళి పని కావాలని అడిగాడు. దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ''నీకు తెలుగు వచ్చా'' అని అడిగాడు. దానికి సమాధానంగా ''మీకు తెలుగు రాదా'' అని అడిగాడు. నివ్వెరపోయిన పంతులుతో నేనిప్పటి వరకు తెలుగులోనే కదా మాట్లాడాను, అందుకే మీ ప్రశ్నకు సమాధానం ఎలా ఇవ్వాలో తెలియలేదు అని అన్నాడు. ఆంధ్రపత్రికలో ఉద్యోగం చేస్తుండగా, ఒక ప్రముఖునిపై పద్యం వ్రాయవలసి వచ్చింది. నేను వ్యక్తులపై పద్యాలు వ్రాయను అని భీష్మించుకుని, దాని కోసం ఆ ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు సుందరాచారి. తరువాత విద్యాశాఖలో పాఠశాల పర్యవేక్షకుడిగా పనిచేశాడు. నందనూరులో ఉండగా ఒకసారి పాఠశాల సంచాలకుడు వచ్చాడు. ఆ సంచాలకుడు సుందరాచారిని ప్యూనుగాను, ప్యూనును పర్యవేక్షకుడిగాను పొరబడ్డాడు. దానికి కోపగించి, సుందరాచారి ఆ ఉద్యోగానికి తక్షణమే రాజీనామా చేశాడు. భార్యా అనారోగ్యం కారణంగా ఆయన వేదనచెంది, జీవిత చరమాంకంలో ఒక రకమైన నిర్లిప్త జీవితం గడిపాడు. సుందరాచారి 1977 ఏప్రిల్‌ 8న తిరుపతి, గంగుండ్ర మండపం వీధిలో నివాసముంటున్న ఇంట్లో మరణించాడు. 2004లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, తిరుపతి పట్టణము తిరుచానూరు రోడ్డులోని అన్నపూర్ణేశ్వరి సర్కిల్‌లో సుందరాచారి జ్ఞాపకార్థం, ఆయన కాంస్య విగ్రహాన్ని నెలకొల్పింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!