చందమామ కథ : ఎద్దు బాధ


చందమామ కథ : ఎద్దు బాధ
..................
శ్రీరంగాపురంలో భూస్వామి రామేశం కొత్తగా ఓ ఎద్దుల జతను కొన్నాడు. వాటిలో ఒకటి చురుగ్గానే పనిచేస్తున్నా మరొకటి మాత్రం పదే పదే మొరాయించసాగింది. బలవంతపెడితే కదలకుండా కూర్చుంటుంది. పనిచేయని ఆ ఒక్క ఎద్దును అమ్మడం అసాధ్యమని భావించి, రెండింటినీ విక్రయించాలనుకున్నాడు రామేశం. ఒకనాడు రామేశం మిత్రుడు స్వరవర్మ పొరుగూరు నుంచి వచ్చాడు. అతను సామాన్య రైతు. “వర్మా.. ఇటీవలే కొన్న నా ఎద్దుల జతను సగం ధరకే అమ్మాలని నిర్ణయించుకున్నాను. వాటిని చూసి నచ్చితే కొనుగోలు చేసుకువెళ్లు. పైకం కూడా నీకు వీలున్నప్పుడివ్వు,” అన్నాడు రామేశం.
పక్కనే పాకలో ఉన్న ఎడ్లను పరీక్షించిన స్వరవర్మ వాటిని కొని తన వెంట తీసుకెళ్లాడు. అంత సులువుగా అవి అమ్ముడవడం రామేశానికి ఆనందం కలిగించింది. అయితే ఓ నెల గడిచాక ఎద్దులతో స్వరవర్మ ఎలా నెగ్గుకొస్తున్నాడో తెలుసుకోవాలనిపించింది. వెంటనే స్నేహితున గ్రామం బయలు దేరాడు. దారిలోనే ఉన్న పొలం వద్ద స్వరవర్మ కనిపించాడు.
అక్కడ తను అమ్మిన ఎడ్లు ఎంతో శాంతంగా పొలాన్ని దున్నడం గమనించాడు రామేశం. ఇబ్బంది పెట్టిన ఎద్దు కూడా ఎంతో హుషారుగా నాగలి లాగుతోంది. ఎంతో ఆశ్చర్యం కలిగింది.
మిత్రుడి అనుమానం గమనించిన స్వరవర్మ “ఎద్దుల్ని కొనడానికి ముందే వాటి పరిస్థితి నీ పనివాళ్ల మాటల ద్వారా తెలిసింది. వాటిని పరీక్షించి, ఏ లోపం లేదని నిర్ధారించుకున్నాకే కొన్నాను. ఎద్దు మొండికేయడానికి కారణం.. నీకున్న విశాలమైన, గట్లు లేని పొలాన్ని చూసి గొడ్డు చాకిరీ చేయాలని అది భయపడటమే! మోర ఎత్తితే గట్లు కనిపించే నా చిన్న కమతాన్ని ప్రయాస లేకుండా దున్నుతోంది. నువ్వు దాని బాధను అర్థం చేసుకోలేక పోయావు,” అన్నాడు. సందేహ నివృత్తి కలగడంతో రామేశం సంతోషించి, మిత్రుడి అంచనా సామర్థ్యాన్ని ఎంతగానో పొగిడాడు.
–ఎస్. సుధారాణి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!