‘కాకమానిరాయ!’

‘కాకమానిరాయ!’

.

ఇది నేను చదువుకునే రోజుల్లో మా గురువు గారు చెప్పిన కథ...

.

శ్రీకృష్ణదేవరాయల సభలో ‘మూర్తికవి’ ఉండేవాడు. (రామరాజభూషణునికి మూర్తికవి అన్న పేరుంది కాని ఈ మూర్తికవి వేరొకరు కావచ్చు).

ఒకసారి అతని కవిత్వాన్ని మెచ్చుకొని రాయలు ‘కాకమాను’ అనే గ్రామాన్ని దానంగా ఇచ్చి ఇంద్రనీలమణులు పొదిగిన కుండలాలను బహూకరించాడు. మూర్తికవి రోజూ వాటిని ధరించి సభకు వచ్చి అష్టదిగ్గజాలకు సమీపంగా కూర్చునేవాడు. ఆ మణులనుండి పరావర్తనం చెందిన నలుపువల్ల కవులందరి ముఖాలు నల్లగా కనిపించేవి. అది గమనించిన రాయలు నవ్వుతూ

“అష్టదిగ్గజాల ముఖాలు ఎందుకో వివర్ణమయ్యాయి” అని పరిహాసం చేశాడట.

.

ఈ అవమానాన్ని కవులు భరించలేకపోయారు. ఎలాగైనా అతని దగ్గర ఆ కుండలాలు లేకుండా చేయాలని నిశ్చయించుకున్నారు. కాని ఆ పనికి ఎవరు పూనుకోవాలా అనేది సమస్య. చివరికి తెనాలి రామకృష్ణుడు ఆ కార్యభారాన్ని తాను స్వీకరించాడు.

.

ఒకరోజు మూర్తికవి తన ఇంట్లో భోజనం చేసి విశ్రాంతిగా కూర్చున్నవేళ రామకృష్ణుడు వెళ్ళాడు.

.

“ఓహో.. రామకృష్ణకవి గారా? ఏమిటిలా దయచేశారు?” అడిగాడు మూర్తికవి.

రామకృష్ణకవి వినయంగా “రాయలవారి మెప్పు పొందిన మేటికవులు మీరు. ఏదో కుర్రవాణ్ణి! మీమీద ఒక పద్యం వ్రాశాను. మీకు వినిపించాలని ఉబలాటంగా ఉంది” అన్నాడు.

.

“ఆలస్య మెందుకు? వినిపించు” అన్నాడు మూర్తికవి.

రామకృష్ణకవి వినిపించిన పద్యం ఇది....

.

“అల్లసానివాని యల్లిక జిగిబిగి

ముక్కుతిమ్మనార్యు ముద్దుపలుకు

పాండురంగవిభుని పదగుంఫనంబును

కాకమానిరాయ! నీకె తగుర.”

.

(కాకమాని గ్రామానికి అధిపతివైన ఓ మూర్తికవీ! అల్లసాని పెద్దన కవిత్వంలోని అల్లిక జిగిబిగి, ముక్కు తిమ్మన ముద్దుమాటలతో కవిత్వం చెప్పే నైపుణ్యం, పాండురంగమాహాత్మ్య కర్త తెనాలి రామకృష్ణుని కవిత్వంలోని పదగుంఫనం నీకే తగినట్టివి)

ఆ పద్యాన్ని విని మహదానందభరితుడైన మూర్తికవి “ఏం కావాలో కోరుకో” అన్నాడు.

“మీ కుండలా లివ్వండి చాలు!” అన్నాడు రామకృష్ణుడు.

మూర్తికవి సంతోషంగా తన కుండలాలు తీసి ఇచ్చాడు.

.

మరునాడు కుండలాలు లేకుండా సభకు వచ్చిన మూర్తికవిని చూసి రాయలు “ఈరోజు కుండలాలు లేకుండా వచ్చారేం?” అని ప్రశ్నించాడు.

“రామకృష్ణకవి నామీద ఒక పద్యం చెప్పాడు. సంతోషించి బహుమానంగా ఇచ్చాను” అన్నాడు మూర్తికవి.

.

“ఔనా? ఒక కవిని మెప్పించిన పద్యం అంటే అది చాలా గొప్పదై ఉండాలి. ఏదీ వినిపించండి” అని కోరాడు రాయలు.

“నన్ను పొగడిన పద్యాన్ని నేనే చెపితే బాగుండదు. రామకృష్ణ కవి ఉన్నాడు కదా! అతణ్ణే చదవమనండి” అన్నాడు మూర్తికవి.

.

రాయల కోరికమీద రామకృష్ణుడు ఆ పద్యాన్ని చదివి వినిపించాడు. దాన్ని వినగానే రాయలతో సహా సభికులంతా గొల్లుమని నవ్వారు. ముఖం వివర్ణం కావడం ఈసారి మూర్తికవి వంతయింది.

చమత్కార మేమిటంటే...

మూర్తికవి వీపున తామర. అందుకని ఎప్పుడూ తన ఆసనాన్ని ఒక స్తంభం దగ్గర వేసికొని దురద పెట్టినప్పుడల్లా వీపును ఆ సంభానికి రాసేవాడు. 

రామకృష్ణుడు పద్యం చివరిపాదాన్ని “కాక - ‘మాని’ రాయ నీకె తగుర” 

అన్న విరుపుతో చదివాడు. 

మాను అంటే స్తంభం. ‘స్తంభానికి వీపురాయడం నీకే తగును’ అన్న అర్థం వచ్చేలా చదివాడు.

ఆ విధంగా మూర్తికవికి శృంగభంగం జరిగింది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!