వేదం ...జీవన నాదం!

వేదం ...జీవన నాదం!

ఎందుకు రాశానంటే...........(దాశరథి రంగాచార్య)

.

నన్నయకూ పోతనకూ తిక్కనకూ దొరకని అదృష్టం నాకు దక్కింది.వేదాల్ని తెలుగులోకి అనువదించే మహద్భాగ్యం నాకే దక్కింది. అంతటి బృహత్యార్యంలో నాకు సాయపడిందెవరూ లేరు. నేనే కాయితం కొనుక్కొని పెన్సిల్‌ కొనుక్కొని రాశాను.

,

ఒకటా రెండా! ఐదువేల పేజీలు. ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాల్నీ కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే. అంతేకాదు, వేదాలకు వ్యాఖ్య చేసిన సాయణాచార్యులు మన ఆంధ్రుడే. ఇది తెలుగువారి అదృష్టం.

.

'"ఎవరు పడితే వారు వేదం చదవకూడదు' ...ఒక అపోహ....ఇదెందుకొచ్చిందీ అంటే, ఒక వర్గానికి ఇది ఉపాధి. అందులో వాళ్ల ఆధిపత్యం పోతుందని భయమ ""

,

కానీ అదంతా తప్పు. వేదం అంటే జ్ఞానం కదా, అది ఒకరి అధీనంలో ఉండడమేమిటి? జ్ఞానానికి అడ్డుగోడలేమిటి? దాన్నెవరు పిడికిట్లో పట్టుకోగలరు? ఇది అందరికీ అందవలసింది... అనుకొని వేదాల్ని అనువదించడం వెుదలుపెట్టాను. సరే... వేదాలకు అనువాదం చేస్తున్నాననగానే బోలెడంత ప్రచారం జరిగింది. దాంతో చాలామంది 'నువ్వు వేదం అనువాదం చెయ్యెుద్దు, నాశనమైపోతావు' అని భయపెట్టేవారు. రాత్రిపూట ఫోన్లొస్తే తీయడానికి కూడా మా కమల భయపడిపోయేది. నా ఇంటి ముందు ఎవడో ఆత్మహత్య చేసుకుంటానంటూ వీరంగం వేశాడు. ఏదైనా మంచిపని చెయ్యాలన్నప్పుడు ఇలాంటి ఇబ్బందులు తప్పవు కదా! అయినా నేను చేయాలనుకున్నది చేశాను. ఊహూ! ఆ భగవంతుడే నాతో చేయించాడు. వెుత్తం పదివేల మంత్రాలు. వాటన్నిటినీ చదివి మనసులో ఉంచుకొని దర్శించి తెలుగులోకి అనువదించడమంటే మాటలా! అప్పటి నా అవస్థ ఇదీ...

,

ముందర కూచుంటాను. మహారణ్యంలోకి పోయినట్టుంటుంది. పెద్దపులులూ సింహాలూ ఎలుగుబంట్లూ... మనమేం చెయ్యగలం అనిపిస్తుంది. నిమిషం కళ్లుమూసి తెరిస్తే అదే అడవి ఉద్యానంలా కనిపిస్తుంది. అందులో నెమళ్లుంటాయి. కుందేళ్లుంటాయి. కోయిలలుంటాయి. అదే నాకు అర్థమైందని అర్థం. నేను రాస్తుంటే నా కలం వెంబడి ఏదో వెలుగుపాయ వస్తున్నట్టు కనిపిస్తుంది. మన ప్రయత్నం చెల్లదు దానికి. అంతా రాశాక నా అనువాదం చదివితే నాకే ఆశ్చర్యమనిపించింది... స్వరం కూడా ఉన్నదందులో! రాసింది వచనమే అయినా స్వరం ఎలా వచ్చిందో తెలియదు. నేను కావాలని చేసిందయితే కాదు. నా శ్రమ ఫలించింది. 'ఎవరు కొంటారు సార్‌ వేదం... రెండు మూడు వేల కాపీలు పోతే ఎక్కువ' అన్నారు. కానీ వేదానువాదం ప్రచురితమవుతున్నదని తెలియడం ఆలస్యం... ప్రచురణ మొదలవక ముందే 2వేల పుస్తకాలకు ఆర్డరొచ్చింది. అంటే... రూ.30లక్షలు అడ్వాన్సు!. పుస్తకం మార్కెట్లో విడుదలైన రోజున బారులు తీరి నుంచొని మరీ కొన్నారా పుస్తకాన్ని. 'తెలుగువాళ్లూ పుస్తకం కొంటారు' అని ఓ పేరున్న పత్రికలో ఆ అరుదైన సంఘటనపై ఓ వ్యాసం కూడా వచ్చింది. ఆ స్పందన చూసి పుస్తక విక్రేతలే ఆశ్చర్యపోయారు. ప్రజల్లో వేదం పట్ల అంత ఆసక్తి ఉంది. లేకపోతే ఎవరు కొంటారు? ఒక సంవత్సరంలో రూ.50లక్షల టర్నోవర్‌ ఎందుకు అవుతుంది?

.

ఇప్పుడు కనీసం 20వేల మంది ఇళ్లల్లో వేదం ఉన్నది. అదీ నేను అనువాదం చేసింది.

అది నాకెంతో సంతోషం.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!