కార్తిక పురాణం 2వ రోజు


-

కార్తిక పురాణం 2వ రోజు!

-బ్రహ్మర్షి అయిన శ్రీ వశిష్ట మహర్షి రాజర్షి అయిన జనకునికి ఇంకా ఇలా చెప్పసాగాడు.
''రాజా! ఈ కార్తీకమాసంలో స్నాన దాన జపాల్లో దేనినైనా, కొద్దిపాటిగా ఆచరించినా సరే.. అది అక్షయమైన ఫలాన్ని ఇస్తుంది. ఎవరైతే,సుఖలాలసులై శరీర కష్టానికి భయపడి కార్తీక వ్రతాన్ని ఆచరిన్చారో అలాంటివాళ్ళు వంద జన్మలు కుక్కలుగా పుడతారు.
పౌర్ణమ్యాం కార్తీకమాశ స్నానాందీస్తు నాచారాన్|
కోటి జన్మసు చండాలయోనౌ సంజాయతే నృప||
క్రమాద్యోనౌ సముత్పన్నో భవతి బ్రహ్మరాక్షసః|
అత్రై వోదాహరంతీ మ మితిహాసం పురాతనం||
భావం:
కార్తీక పౌర్ణమినాడు, స్నాన దాన జపోపవాసాల్లో ఏ ఒక్కటీ కూడా ఆచరించనివాళ్ళు కోటి పర్యాయాలు చండాల జన్మలు ఎత్తి, చివరికి బ్రహ్మరాక్షసులుగా పరిణమిస్తారు. ఇందుకు ఉదాహరణగా ఒక గాథను చెప్తాను వినండి..
తత్వనిష్ఠోపాఖ్యానం
పూర్వం ఆంధ్రదేశంలో తత్వనిష్ఠుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. సకల శాస్త్ర పారంగతుడు, అసత్యాలను పలకనివాడు, భూతదయ గల దయాళువూ, తీర్థాటనప్రియుడు అయిన ఆ విప్రుడు ఒకసారి తీర్ధయాత్ర గురించి ప్రయాణిస్తూ దారిలో గోదావరీ తీరాన ఉన్న ఒకానొక ఎత్తయిన మర్రిచెట్టు మీద కారునలుపు శరీర ఛాయ గలవారు, ఎండిన డొక్కలు, ఎర్రని కళ్ళు, పెరిగిన గడ్డాలతో జుట్టు ఇనుప తీగల్లా పైకి పొడుచుకు నిటారుగా నిలబడిఉన్న తల వెంట్రుకలతో వికృత వదనాలతో కత్తులు, కపాలాలూ ధరించి సర్వజీవ భయంకరులుగా ఉన్న ముగ్గురు బ్రహ్మరాక్షసులను చూశాడు.  ఆ రాక్షసులవల్ల భయంచేత మర్రిచెట్టు నాలుగువైపులా కూడా పన్నెండు మైళ్ళదూరంలో ఎక్కడా ప్రాణి సంచారం అనేది ఉండేది కాదు. అటువంటి భయకర స్వరూపులైన ఆ రాక్షసులను అల్లంత దూరం నుండి చూసిన తత్వనిష్ఠుడు అదిరిపడ్డాడు. దాంతోబాటే ఆ రాక్షసులు కూడా తనను చూడటంతో మరింత భయపడి శోకాకుల చిత్తంతో శ్రీహరిని స్మరించసాగాడు.
తత్వనిష్ఠుడి శరణాగతి
త్రాహి దేవేశ లోకేష త్రాహి నారాయణావ్యయ సమస్త భయవిధ్వంసిన్|
త్రాహిమాం శరణాగతం వ్యాసం పశ్యామి దేవేశ! త్వట్టోహం జగదీశ్వర||
భావం: 
''దేవతలకూ, లోకాలకూ కూడా యజమానివి అయినవాడా! నారాయణా! అవ్యయా! నన్ను కాపాడు. అన్నిరకాల భయాలనూ అంతం చేసేవాడా! నిన్నే శరణు కోరుతున్న నన్ను రక్షించు. ఓ జగదీశ్వరా! నువ్వు తప్ప ఇంకొక దిక్కు ఎరుగని వాడను. నన్ను అన్నివిధాలా కాపాడు'' అని ఎలుగెత్తి స్మరిస్తూ రాక్షస భయంతో అక్కడినుంచి పారిపోసాగాడు. అతన్ని పట్టుకుని చంపాలనే ఆలోచనతో ఆ రాక్షసత్రయం అతని వెనుకే పరిగెత్తసాగింది. రాక్షసులు దగ్గరౌతున్న కొద్దీ సాత్వికమైన విప్ర తేజస్సు ద్యోతకం అవడంవల్ల తెరిపి లేకుండా అతను హరినామాన్ని స్మరించడంవల్ల వెంటనే వారికి జ్ఞానోదయం అయింది. అదే తడవుగా బ్రాహ్మణునికి ఎదురుగా వెళ్ళి దండప్రణామం చేసి, అతనికి తాము ఎలాంటి కీడు తలపెట్టామని నమ్మబలికి ''ఓ బ్రాహ్మణుడా! నీ దర్శనంతో మా పాపాలు నసిమ్చిపోయాయి'' అని మళ్ళీ నమస్కరించారు.  వారి నమ్రతకు కుదుటపడిణ హృదయంతో తత్వనిష్ఠుడు ''మీరెవరు? చేయరాని పనులు ఏం చేసి ఇలా అయ్యారు? మీ మాటలు వింటే బుద్దిమంతుల్లా ఉన్నారు. మరి ఈ వికృత రూపాలేమిటి? నాకు వివరంగా చెప్పండి.. మీ భయాలు, బాధలు తొలిగే దారి చెప్తాను'' అన్నాడు.
 ద్రావిదుని కథ
పారుని పలుకులపై, ఆ రాక్షసుల్లో ఒకడు తన కథను ఇలా వినిపించాడు.
''విప్రోత్తమా! నేను ద్రావిడిని. ద్రవిడ దేశంలోని మంధర అనే గ్రామాదికారిని. కావడానికి బ్రాహ్మణుడినే అయినా గుణానికి కుటిలుడిని,వంచించే చమత్కారిగా ఉండేవాణ్ణి. ణా కుటుంబ శ్రేయస్సుకై అనేకమంది విప్రుల విత్తాన్ని హరించాను. బంధువులకు గానీ,బ్రాహ్మణులకు గానీ ఏనాడూ పట్టెడు అన్నం పెట్టలేదు. నయ వంచానలతో బ్రాహ్మణ ధనాన్ని అపహరించడంవల్ల ణా కుటుంబం నాతొ సహా ఏడు తరాలవాళ్ళు అథోగతి పాలయ్యారు.
మరణానంతరం దుస్సహమైన నరకయాతనలు అనుభవించి చివరికి ఇలా బ్రహ్మరాక్షసుడినయ్యాను. కృపాయత్త చిత్తుడవై నాకు ముక్తినిచ్చే యుక్తిని చెప్పు'' అన్నాడు.
ఆంధ్రదేశీయుని గాథ
రెండవ రాక్షుసుడు ఇలా విన్నవించుకున్నాడు.
''ఓ బ్రాహ్మణోత్తమా! నేను ఆంధ్రుడిని. నిత్యం ణా తల్లిదండ్రులతో కలహిస్తూ వారిని దూషిస్తూ ఉండేవాడిని. నేను ణా భార్యాపిల్లలతో మృష్టాన్నాన్ని తింటూ తల్లిదండ్రులకు మాత్రం చద్ది అన్నం పెట్టేవాడిని. బాంధవ బ్రాహ్మణకోటికి ఎన్నడూ ఒక పూటయినా భోజనం పెట్టక విపరీతంగా ధనార్జన చేసి గర్వంగా ఉండేవాడిని. చనిపోయిన తర్వాత నరకం చేరి ఘోరాతిఘోరమైన భాధలు అనుభవించి చివరికి ఇలా పరిణమించాను. ఆ ద్రావిడునికి మల్లేనే నాక్కూడా ముక్తి కలిగే మార్గం బోధించు''
పూజారి కథ
మూడవ రాక్షసుడు ముందుకు వచ్చి ''ఓ సదాచార సంపన్నుడా! నేను ఆంధ్రదెస బ్రాహ్మణుడిని. విష్ణు ఆలయంలో పూజారిగా ఉండేవాడిని. కాముకుడను, అహంభావిని అయి పరుషంగా మాట్లాడేవాడిని. భక్తులు స్వామివారికి అర్పించే కైంకర్యాలను వేశ్యలకు ఇచ్చి, విష్ణు సేవలను సక్రమమంగా చేయక గర్వంతో తిరిగేవాడిని. చివరికి గుడి దీపాల్లో నూనెను కూడా దొంగిలించి, వేశ్యలకు ధారపోసి వారితో సుఖంగా గడిపేవాణ్ణి. పాపపుణ్య విచక్షణ తెలిసేది కాదు. నా దోషాలకు ప్రతిఫలంగా నరకాన్ని చవిచూసి అనంతరం ఈ భూమిపై నానావిధ హీన జన్మలూ ఎత్తి చివరికి బ్రహ్మరాక్షసుని అయ్యాను. ఓ విప్రుడా! నన్ను మన్నించి మళ్ళీ జన్మించే అవసరం లేకుండా మోక్షాన్ని పొందే మార్గాన్ని చెప్పు'' అని ప్రార్ధించాడు.
 బ్రహ్మరాక్షసులు ఉత్తమ గతి పొందుట
తమ పూర్వ భవకృత అపరాధానికి ఎంతో పశ్చాత్తాపం చెందుతున్న రాక్షసులను చూసి విప్రుడు ''భయపడకండి. నాతొ కలిసి కార్తీక స్నానానికి రండి. మీ సమస్త దోషాలూ నశించిపోతాయి'' అని చెప్పి వారిని తన వెంట తీసికెళ్ళాడు.  అందరూ కలిసి కావేరీనది చేరారు. అక్కడ తత్వనిష్ఠుడు బ్రహ్మరాక్షసుల నిమిత్తం సంకల్పం చేసి తాను స్వయంగా మున్ డు స్నానం చేసి పిమ్మట రాక్షసుల చేత కూడా స్నానం చేయించాడు. తర్వాత
అముకానాం బ్రహ్మరాక్షసత్వ నివారణార్ధం |
అస్యాం కావేర్యాం ప్రాతః స్నానమహం కరిష్యే | |
అనే సంకల్పంతో అతడు విధివిధానంగా స్నానం చేసి, తత్ఫలాన్ని బ్రహ్మరాక్షసులకు ధారపోయగా వారు విగత దోషులూ,దివ్యరూపులూ అయి, తక్షణమే వైకుంఠానికి ప్రయాణమయ్యారు.
విదేహరాజా! అజ్ఞానం వల్ల కానీ, మోహ, ప్రలోభాల వల్ల కానీ ఏ కారణం చేతనైనా కానీ కార్తీకమాస సూర్యోదయ వేళ కావేరీనదిలో స్నానం ఆచరించి విష్ణువును పూజించిన వారికి నిస్సందేహంగా పదివేల యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. అందువల్ల ఏదో ఒక ఉపాయం చేసి కార్తీకంలో కావేరీ స్నానం తప్పకుండా చేయాలి. కావేరిలో వీలు కాకపోతే గోదావరిలో లేదా మరెక్కడైనా సరే ప్రాతఃకాల స్నానం చేయాలి. అలా ఎవరైతే కార్తీక దామోదర ప్రీతిగా ప్రాతః స్నానం చేయరో వాళ్ళు పది జన్మలు చండాలపు జన్మలు ఎత్తి అనంతరం ఊరపందులుగా జన్మిస్తారు.
కనుక ఎటువంటి మీమాంసలూ లేకుండా స్త్రీలు గానీ, పురుషులు గానీ కార్తీకమాసంలో తప్పక ప్రాతఃస్నానం చేయాలి.  అప్పుడు జనకుడు ''హే బ్రహ్మర్షీ! నువ్వు ఇంతవరకూ కార్తీక మహత్యాన్ని అసాధారణ ధోరణిలో చెప్పావు. అయితే ఏ సంకల్పంతో ఈ వ్రతం ఆచరిన్చాలో, ఏయే దానాలు చేయాలో కూడా తెలియజేయి'' అనడిగాడు.
వశిష్ట ఉవాచ:
అన్ని పాపాలనూ హరించేది, పుణ్యాలను అగణ్యాలుగా మార్చేది అయిన ఈ కార్తీక వ్రతానికి ఫలానా సంకల్పం అనేది హాస్యాస్పదం అయిన విషయం. కార్తీక వ్రతం ఆచరించడం వల్ల నశించనంతటి పాపం అనేది ఇంకా ఈ ప్రపంచంలో పుట్టనే లేదు. అంత మహత్తరమైన ఈ వ్రత ధర్మాలను, తత్ఫలితాలను చెప్తాను విను.
 కార్తీకమాస సాయంకాలం శివాలయంలో దీపారాధన చేయడం వలన అనంతమైన ఫలము లభిస్తుంది. శివాలయ గోపురద్వారా,శిఖరాలయందు గానీ శివలింగ సన్నిధిలో గానీ దీపారాధన చేయడం వల్ల అన్ని పాపాలూ అంతరించిపోతాయి. ఎవరయితే కార్తీకంలో శివాలయంలో ఆవునేతితో కానీ విప్ప నారింజ నూనెలతో గానీ దీప సమర్పణ చేస్తారో వాళ్ళు ధర్మవేత్తలౌతారు. ఆఖరికి ఆముదపు దీపాన్ని అయినా సమర్పించినవాళ్ళు అత్యంత పుణ్యవంతులౌతారు. కాంక్షతో గానీ కనీసం నలుగురి నడుమా బడాయి కోసం గానీ దీపాన్నిచ్చే వాళ్ళు కూడా శివప్రియులౌటారు. ఇందుకు ఉదాహరణగా ఒక చిన్న కథ చెప్తాను విను.
కార్తీక
దీపారాధన మహిమ
పూర్వం పాంచాలదేశాన్ని పరిపాలించే మహారాజు కుబేరుని మించిన సంపదలు ఉన్నప్పటికీ, కుమారులు లేని కారణంగా కుంగిపోయి, కురంగపాణికై తపస్సు చేశాడు. మధ్యకాలంలో అటుగా వచ్చిన పిప్పలుడు అనే ముని అతని తపస్సుకు కారణం అడిగి తెలుసుకుని ''ఓ రాజా! ఈ మాత్రం కోరికకు తపస్సుతో పనిలేదు. కార్తీకమాసంలో శివప్రీతిగా వ్రతం ఆచరించి, బ్రాహ్మణులను దీప దాన దక్షిణలతో సంతోషపెట్టు. అలా చేస్తే నీకు తప్పక సంతానం కలుగుతుంది'' అని చెప్పాడు. ఋషి వాక్యం శిరోధార్యంగా భావించి ఆ పాన్చాలుడు తన పట్టణం చేరి కార్తీక వ్రతం ఆచరించి, శివప్రీతికై బ్రాహ్మణులకు దీప దానములు చేశాడు. తత్ఫలితంగా మహారాణి నెల తప్పి, యుక్తకాలంలో మగ శిశువును ప్రసవించింది. రాజా దంపతులు ఆ శిశువుకు ''శత్రుజిత్తు'' అని పేరు పెట్టారు.
శత్రుజిత్తు చరిత్ర
శత్రుజిత్తు దినదిన ప్రవర్ధమానంగా పెరిగి, యువకుడై, వీరుడై వేశ్యాంగనా లోలుడై ఇంకా తృప్తి చెందక పర స్త్రీ అనురక్తితో యుక్తాయుక్త విచక్షణ లేక విచ్చలవిడిగా ప్రవర్తించసాగాడు. హితవు చెప్పేవారిని చంపుతానని బెదిరిస్తూ పరమ హీనంగా జీవిస్తున్నాడు. ఇలా ఉండగా ఒక మహా సౌందర్యరాశి అయిన విప్రుని భార్యను చూసి మోహితుడయ్యాడు. ఆమె కూడా ఈ యువరాజు పట్ల మోజుపడింది.  భర్త నిద్రించగానే ఆమె రాజు రమ్మన్న సంకేత స్థలానికి వచ్చేది. ఇద్దరూ ఆనందించేవారు. ఒకరోజు భర్తకు విషయం తెలిసిపోయింది.కానీ, ఆ విప్రుడు పైకి ఏమీ తెలీనట్లు ఉన్నాడు. ఇద్దరూ కలిసుండగా చూసి చంపాలి అనుకుని కత్తి చేతబట్టి తిరుగుతున్నాడు. వారికి ఈ సంగతి తెలీదు. ఒక కార్తీక పౌర్ణమినాడు సోమవారం కలిసివచ్చింది. ఆవేళ కాముకులిద్దరూ సురత క్రీడలకై పాడుపడ్డ శివాలయాన్ని సంకేత స్థలంగా ఎంచుకున్నారు. అపరాత్రి వేళ ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు. ఆలయంలో చీకటిని పోగొట్టేందుకు విప్ర స్త్రీ తన చీర కొంగును చింపి, ఒత్తిని చేసింది. రాజు ఆముదం తెచ్చి అక్కడున్న ఖాళీ ప్రమిదలో పోశాడు. మొత్తానికి దీపం వెలిగించారు. ఇక ఇద్దరూ ఏకమయ్యారు.
విప్రుడు అక్కడికొచ్చి, వారిద్దర్నీ చంపేసి, తాను కూడా కత్తితో పొడుచుకుని చనిపోయాడు. అటు యమదూతలు, ఇటు శివ దూతలూ కూడా వచ్చారు. శివదూతలు విప్ర స్త్రీని, రాజును కైలాసానికి తీసికెళ్ళారు. యమదూతలు విప్రుని నరకానికి లాక్కేళుతుంటే అతను ఆక్రందన చేస్తూ ''పాపం చేసినవారికి కైలాసం, నాకేమో నరకమా?'' అన్నాడు. అందుకు యమదూతలు''వీరెంత పాపాత్ములైనా ఈరోజు కార్తీక పౌర్ణమి. పైగా సోమవారం. ఏ కారణం అయితేనేం దీపం వెలిగించారు. అందునా ఆలయంలో వెలిగించారు. కనుక పుణ్యాత్ములయ్యారు. అలాంటివారిని చంపి నువ్వు పాపాత్ముడివి అయ్యావు. అందుకే వారికి కైలాసం, నీకు నరకం'' అన్నారు.
బ్రాహ్మణుడికీ, శివదూతలకు జరిగిన సంభాషణ విన్న శత్రుజిత్తు తాను కలుగజేసుకుని ''అయ్యా, దోషం చేసింది మేము. మాకు కైవల్యం ఇచ్చి, ఈ పుణ్యదినాన మమ్మల్ని చంపి, మాకు స్వర్గప్రాప్తి కలగాజేస్తున్న అతన్ని నరకానికి పంపడం భావ్యం కాదు.
కార్తీకమాసం గొప్పది అయితే, సోమవారం ఇంకా పుణ్యమైంది అయితే, దీపారాధన మరీ పుణ్యప్రదమైంది అయితే మాతోబాటే కలిసి మరణించిన ఆ బ్రాహ్మణునికి కూడా కైలాసం ఇవ్వక తప్పదు'' అని వాదించాడు. ఫలితంగా శత్రుజిత్తు తానూ, తన ప్రేయసి చేసిన ఒత్తులు, ఆముదం పుణ్యం తాము ఉంచుకుని, దీపం వెలిగించిన పుణ్యాన్ని విప్రునికి ధారపోయగా అతన్ని కూడా దూతలు కైలాసానికి తీసికెళ్ళారు.  కనుక, ఓ మిధిల నగరాధీశ్వరా! కార్తీకమాసంలో తప్పనిసరిగా శివాలయంలో గానీ, విష్ణుఆలయంలో గానీ దీపారాధన చేసి తీరాలి.నెల పొడుగునా చేసిన వాళ్ళు జ్ఞానులై, తద్వారా మోక్షాన్ని పొందగల్గుటారు. అందునా శివాలయంలో చేసిన దీపారాధన నిరంతర మోక్షప్రదాయినిగా గుర్తించు. నా మాట విని కార్తీకమాసం నెల పొడుగునా నువ్వు శివాలయంలో దీపారాధన చెయ్యి''

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!