హనుమంతుని గంధ, సింధూర విశేషం!

-

హనుమంతుని గంధ, సింధూర విశేషం!-

శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .

-

శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .

ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!